Thursday, August 20, 2015

చేతుల్లో దిటవుగా పొదవి పట్టుకున్న పాత్రలోంచి
మధురాతి మధురమైన మధువు వొలికిపోయి
యేడాదులు రెండు గడిచాయట.

హృదయ సామ్రాజ్యాన్నేలుతున్న రసరమ్య గీతాన్ని
పాడుకోవడంకోసం తడుముకోవడం మొదలెట్టి
యేడాదులు రెండు యేకంగా గడిచిపోయాయట.

పూలాతోటలో విరబూసిన మూక్కలు ఎండకు తట్టుకోలేక
వాడుముఖం పెట్టి వల వలా యేడ్వడం ప్రారంభించి
సరిగ్గా రెండు గ్రీష్మాలు గడిచిపోయాయట.

నాప్రక్కనే వుంటూ అహోరాత్రాలూ శ్వాసించిన వెన్నెల చందమామ
నల్లటిమబ్బుల మధ్యకు జారిపోయి మసక బారడం మొదలెట్టి
రెండు శిశిరాలు దాటిపోయాయట.

ఇప్పుడు యే భక్తి గీతం నా హృదయకుహరాల్లో
ధ్వనించే అవకాశం మృగ్యం.
అష్టొత్తరాలూ శతనామాలు ఇక నా శ్రవణ పేయంగా
వినబడవని తీర్మానం జరిగిపోయింది.

ఇక ఒంటరితనన్ని ఒదిలోకి చేర్చుకుని మంచు  దుప్పటిని కప్పుకుని
శేషజీవితం గడుపుకోవడమే శ్రేయోదాయకమని
అక్షరసహ ఋజువయిపోయింది.

పాతకాలo లో తనకోసం రాసుకున్న ప్రణయగీతాలనే పదే పదే పాడుకోవడం తప్ప
 ఇంకా రాయగలిగిన గీతాలేం మిగిలిపోయి లేవని ఖాయమయింది.
============================================================

No comments:

Post a Comment